సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 2 వరకూ విదేశీ పర్యటనలో వుండనున్నారు. మంగళవారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో పారిస్ బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్కు ఆయన కేబినెట్లోని పలువురు మంత్రులు వీడ్కోలు పలికారు. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి వున్నారు. పారిస్లో చదువుతున్న తన కూతురు కళాశాల స్నాతకోత్సవానికి జగన్ వెళ్లారు.
తన పారిస్ టూర్కు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేసి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు జగన్. పారిస్లో పర్యటించేందుకు జగన్కు 10 రోజుల పాటు కోర్టు అనుమతించింది. ఈ పర్యటన ముగించుకుని జగన్ జులై 3న తిరిగి రానున్నారు. భారతీయ కాలమానం ప్రకారం 29 ఉదయం పారిస్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి దంపతులు. జూలై 2వ తేదీన పెద్ద కుమార్తె హర్షా యూనివర్సిటీ కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్, సతీమణి భారతి. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు జగన్ కుమార్తె వైఎస్ హర్షా రెడ్డి. జూలై 3వ తేదీన తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.