తిరుపతి జిల్లాలో పెట్టుబడుల వెల్లువ.. పలు కంపెనీలతో సీఎం జగన్ కీలక ఒప్పందాలు

0
240

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఈఎంసీలో మూడు గ్లోబల్‌ కంపెనీల యూనిట్లను సీఎం జగన్ గురువారం నాడు ప్రారంభించారు. టీసీఎల్, ఫాక్స్‌లింక్, డిక్సన్‌ టెక్నాలజీస్‌ యూనిట్లను ప్రారంభించారు. ఆయా కంపెనీల్లో టీవీ మొబైల్‌ ప్యానెళ్లు, కెమెరా మాడ్యూల్స్, ప్రింటర్ల సర్క్యూట్‌బోర్డులు, ఐఫోన్ల ఛార్జర్ల తయారుకానున్నాయి. అటు మరో రెండు యూనిట్లకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఇంగలూరులో అడిడాస్‌ షూ తయారీ కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన నిర్వహించారు. ఈ కంపెనీకి సంబంధించి రెండు దశల్లో రూ.800 కోట్ల పెట్టుబడి రానుంది. ఈ మేరకు ఏపీఈఐటీఏ ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ రోజు సీఎం జగన్ ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల పెట్టుబడుల విలువ దాదాపు రూ.4వేల కోట్లుకాగా సుమారు 20వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ముఖ్యమంత్రి ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన యూనిట్లు:

వకుళమాత దేవాలయం ప్రారంభించిన తర్వాత సీఎం శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరు వద్ద హిల్‌టాప్‌ ఎస్‌ఈజెడ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ (అపాచీ) పరిశ్రమకు భూమి పూజచేశారు. రెండు దశల్లో రూ.800 కోట్లను ఈకంపెనీ ఖర్చుచేయనుంది. 10వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో 80శాతం మహిళలకే. విఖ్యాత బ్రాండ్‌ అడిడాస్‌ షూలు, లెదర్‌జాకెట్స్, బెల్టులు తదితరవాటిని అపాచీ తయారుచేస్తోంది. సెప్టెంబరు 2023 నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. తర్వాత సీఎం టీసీఎల్‌ సబ్సిడరీ కంపెనీ పానెల్‌ ఆప్టో డిస్‌ప్లే టెక్నాలజీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (పీఓటీపీఎల్‌)యూనిట్‌ను ప్రారంభించారు. ఈ యూనిట్‌ కోసం రూ.1230 కోట్ల పెట్టుబడి పెట్టింది. 3200 మందికి ఉపాధిని కల్పిస్తోంది. టీవీప్యానెళ్లు, మొబైల్‌ డిస్‌ప్లే ప్యానెళ్లను ఈ కంపెనీ తయారుచేస్తోంది. దీంతోపాటు ఫాక్స్‌లింక్‌ తయారీ యూనిట్‌ను కూడా సీఎం ప్రారంభించారు. హెచ్‌పీ ప్రింటర్లకు అవసరమైన ప్రింటెడ్‌ సర్క్యూట్‌బోర్డులను ఇక్కడ అసెంబ్లింగ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఐఫోన్లకు యూఎస్‌బీ ఛార్జర్లనుకూడా తయారు చేస్తున్నారు. ఈ యూనిట్‌ద్వారా ఈ కంపెనీ రూ.1050 కోట్ల పెట్టుబడి పెట్టింది. 2వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.సెల్‌ఫోన్లలో కెమెరా మాడ్యూల్స్‌ను తయారుచేసే సన్నీ అప్పోటెక్‌ యూనిట్‌ను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సంస్థ కోసం రూ.280 కోట్ల పెట్టుబడి పెట్టారు. 1200 మందికి ఉద్యోగాలను కల్పించారు. టెలివిజన్‌ సెట్లను తయారుచేసే డిక్సన్‌ టెక్నాలజీస్‌ యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 108 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 850 మందికి ఉద్యోగాలు కూడా రానున్నాయి. ఫాక్స్‌ లింక్‌ఇండియా కొత్తగా నిర్మించనున్న మరో యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లను ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. 1200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

తిరుపతి ఈఎంసీ వేదికపై సీఎం జగన్ సమక్షంలో అవగాహనా ఒప్పందాలు:

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీతో స్మార్ట్‌డీవీ టెక్నాలజీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. హై ఎండ్‌ వీఎఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ టెక్నాలజీలో దాదాపు 3వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. రూ.100 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఇదే కంపెనీ హై ఎండ్‌ వీఎఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ టెక్నాలజీ 10వేలమంది యువతకు శిక్షణ కూడా ఇవ్వనుంది. టీసీఎల్‌ కార్పొరేషన్‌కు చెందిన పీఓటీపీఎల్‌ ఎలక్ట్రానిక్స్‌ కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. తమ వ్యాపార విస్తరణలో భాగంగా పంపిణీ వ్యవస్థను, అనుబంధ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఈ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్‌ రంగం అవసరాలను తీర్చేందుకు, రాష్ట్రాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు జెట్‌వర్క్‌ టెన్నాలజీస్‌ ఒక ఎంఓయూను కుదుర్చుకున్నారు. బ్రహ్మాండంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న యూనికార్న్‌ కంపెనీల్లో జెట్‌వెర్క్‌ టెక్నాలజీస్‌ ఒకటి. ఐటీ సేవల ఎగుమతి కోసం టియర్‌ 2,3 నగరాల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలు తెరిచేందుకు ఏపీఈఐటీఏతో టెక్‌బుల్స్‌ ఎంఓయూను కుదుర్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here