తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కరోనా తీవ్రత తగ్గడంతో భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ 60 నుంచి 70 వేలమంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుంటున్నారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మాఢ వీధుల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవోలు, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. అక్టోబరు 1న గరుడ వాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న రథోత్సవం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగుతాయని తెలియజేశారు.
కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహించారు. ఈసారి మాఢ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు ఉంటుందని ఈవో చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముందని, ఇందుకనుగుణంగా పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో వృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఈసారి గరుడసేవ పెరటాసి మాసంలో మూడో శనివారం రోజున జరుగనుందని, భక్తులు విశేషంగా విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడతామని వివరించారు.
తిరుమలలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని, అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లోనూ పరిశుభ్రంగా ఉంచుతామని ఈవో తెలిపారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను రప్పించి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత కల్పిస్తామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేస్తామన్నారు. గరుడసేవ నాడు భక్తులు ద్విచక్ర వాహనాలను తిరుపతిలోనే పార్క్ చేసి బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని కోరారు.