హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్ సిటీలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, వారి వద్ద నుంచి ఆ సంస్థ లక్షలకు లక్షలు వసూలు చేసింది. మొదట్లో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా తెగ బిల్డప్పులు కూడా ఇచ్చింది. తీరా సమయం చూసి.. ఆ కంపెనీ ఉడాయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కొండాపూర్లోని ఏఎంబీ మాల్కి ఎదురుగా యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ ఐటీ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. మంచి ప్యాకేజ్లతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ట్రైనింగ్ కోసం నిరుద్యోగుల నుంచి రూ.1.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. అలా భారీ మొత్తం వసూలు చేసిన తర్వాత.. నెల రోజుల పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు. ఈ ప్రాసెస్ మొత్తం నిజమే అన్నట్టుగా బాధితుల్ని నమ్మించేలా.. బాగానే కలరింగ్ ఇచ్చారు.
అయితే.. గత నెల రోజుల నుండి కంపెనీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో.. బాధితులందరూ కలిసి కొండాపూర్లో ఉన్న కంపెనీ వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే.. అందరికీ ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. అక్కడ కంపెనీ మూతపడి ఉంది. అప్పుడు తాము మోసపోయామన్న అసలు విషయం తెలిసింది. దీంతో.. నేరుగా మాధాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి, సదరు కంపెనీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.