అర్థరాత్రి తన ఇంట్లోకి దూసుకొచ్చి మరీ గొంతు కోశాడంటూ.. విజయసింహాపై నిషా పెట్టిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తన కోరిక తీర్చలేదన్న కోపంతోనే ఆ మహిళ ఈ నాటకానికి తెరతీసినట్టు తేలింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. తనని దూరంగా ఉంచుతున్నాడని, తాను పిలిచినప్పుడు కలవడం లేదన్న కోపంతో.. అతడ్ని పోలీస్ కేసులో ఇరికించాలని ఈ డ్రామా ఆడింది. అంటే.. అతడు ఎలాంటి దాడి చేయలేదు, ఆమె గొంతుపై ఎలాంటి కత్తి గాట్లు లేవు. వైద్యులు ఈ విషయం చెప్పాక నివ్వెరపోయిన పోలీసులు.. తమదైన శైలిలో విచారిస్తే, అసలు గుట్టు రట్టయ్యింది. అసలేం జరిగిందంటే..
ఓ ఎమ్మెల్యే వద్ద అనుచరుడిగా ఉన్న విజయసింహాకి కొన్ని నెలల క్రితం ఫేస్బుక్లో నిషా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచు చాటింగ్ చేసుకోవడంతో సాన్నిహిత్యం పెరిగింది. అది కొన్ని రోజులకే వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే.. కొన్నాళ్లయ్యాక విజయసింహా ఆమెని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు పిలిచినా, ఆమెని కలవడానికి ఒప్పుకోలేదు. దీంతో.. అతనిపై ఆమె కోపం పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తనపై కత్తితో దాడి చేశాడని, గొంతు కోశాడని నటించింది. అంతేకాదు, తనను చాలా రోజుల నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆమెను ఆసుపత్రికి పంపించి, చికిత్స అందించారు.
అయితే.. నిషా చెప్తున్న మాటల్లో వాస్తవం లేదని, ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని విజయసింహా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతలో వైద్యులు నిషాకు ఎలాంటి గాయాలు కాలేదని, గొంతుపై కత్తి గాట్లు లేవని చెప్పారు. అప్పుడు పోలీసులు నిలదీయగా.. అసలు విషయం చెప్పింది నిషా. తనని దూరం పెడుతున్నందుకే, కోపంతో ఈ పనికి పాల్పడ్డానని చెప్పింది. అతడ్ని ఇరికించాలనే డ్రామా ఆడినట్టు ఒప్పుకుంది. దాంతో.. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపించారు. మరోవైపు.. విజయసింహా ఇంతవరకూ ఫిర్యాదు చేయకపోవడంతో, పోలీసులు ఆ మహిళపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తెలిసింది.