మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయని చెప్పడానికి తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణం. కేవలం ప్రియుడితో తిరగొద్దు అన్నాడని, తన సొంత తమ్ముడ్నే కడతేర్చింది ఓ అమ్మాయి. అవును, సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని రామ్ గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామ్ గఢ్ జిల్లాకు చెందిన చంచల కుమారి (25) ఓ థర్మల్ పవర్ స్టేషన్లో పని చేస్తోంది. ఆ పవర్ స్టేషన్కు సంబంధించిన క్వార్టర్స్లోనే ఆమె నివసిస్తోంది. చంచలకు 21 ఏళ్ల రోహిత్ కుమార్ అనే సోదరుడున్నాడు.
కొంతకాలం క్రితం చంచలకు సోను అన్సారీ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారడంలో.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం ప్రారంభించాడు. అతడు ఆమె క్వార్టర్స్కి తరచూ వచ్చి వెళ్తుండేవాడు. ఈ విషయం రోహిత్ కుమార్కి తెలిసి.. ఆ వ్యక్తి తమ కులం వాడు కాకపోవడంతో, అతనితో కలవొద్దని వారించాడు. దీంతో.. సోదరుడిపై పగ పెంచుకున్న చంచల.. తన ప్రేమకు అడ్డొస్తున్నాడని, అతడ్ని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఒక రోజు చంచల తన సోదరుడ్ని క్వార్టర్స్లోని ఓ రహస్య ప్రాంతానికి పిలిచింది. ఆల్రెడీ అక్కడ మాటు వేసిన సోను.. రోహిత్ రాగానే అతనిపై దాడి చేశాడు. చంచల, సోను కలిసి అతడ్ని చంపేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. క్వార్టర్స్లోనే మృతదేహాన్ని దాచారు.
తమ కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడం, ఎక్కడా జాడ కనిపించకపోవడంతో.. రోహిత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే చంచల కుమారి క్వార్టర్స్లో రోహిత్ మృతదేహం లభించింది. దీంతో చంచలపై అనుమానం రావడంతో.. ఆమెను గట్టిగా నిలదీశారు. అప్పుడు తన ప్రియుడో సోనుతో కలిసి తానే తమ్ముడ్ని చంపేశానని, తమ ప్రేమకు అడ్డుగా ఉన్నందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని తెలిపింది. పోలీసులు చంచల, సోనుని అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేపట్టారు.