ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంబోజ్ను నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే ఆమె బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలిపింది. 1987 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన రుచిరా కాంబోజ్.. ప్రస్తుతం భూటాన్లో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భూటాన్కు భారత మొదటి మహిళా రాయబారిగా ఆమె నిలిచారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన టీఎస్ తిరుమూర్తి స్థానాన్ని రుచిరా భర్తీ చేయనున్నారు.
1987 సివిల్ సర్వీసెస్ బ్యాచ్లో ఆల్ ఇండియా మహిళా టాపర్గా ఆమె నిలిచారు. అంతేకాకుండా 1987 ఫారిన్ సర్వీస్ బ్యాచ్లో టాపర్. 2002 నుంచి 2005 వరకు న్యూయార్క్లోని ఐరాస భారత శాశ్వత మిషన్లో ఆమె నియామకం పొందారు. పలు పదవుల్లో సేవలందించిన ఆమె.. ఇకపై ఐక్యరాజ్య సమితిలో భారత్ గళాన్ని వినిపించనున్నారు. ఇప్పటివరకు ఈ విధులు నిర్వహించిన టీఎస్ తిరుమూర్తి ఐక్యరాజ్యసమితిలో భారత గళాన్ని స్పష్టంగా వినిపించారు. రష్యాపై ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో.. భారత్ వైఖరిని పలు దేశాలు తప్పుబట్టగా, ఆయా దేశాలకు ధీటుగా బదులిచ్చారు.