అమెరికాలో భారీ కుంభకోణానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీల్చంద్రన్(50) అనే వ్యక్తి రూ.300 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు అమెరికా న్యాయస్థానం వెల్లడించింది. అతను తన కంపెనీలలోని పెట్టుబడుదారులకు అధిక ఆదాయం ఆశ చూపి సుమారు 10 వేలమందిని మోసం చేసినట్లు కోర్టు విచారణలో తేలింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. టెక్ పారిశ్రామికవేత్తగా చెప్పుకునే నీల్ చంద్రన్ ఘరానా మోసానికి తెరదీశాడు. విర్సే అనే మాతృసంస్థ కింద ఉన్న పలు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెడితే, అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికాడు.
వాస్తవానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడుదారులకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రన్ కంపెనీలో నిజానికి అలాంటి సంపన్న కొనుగోలుదారులు ఒక్కరు కూడా లేరు. ఇలా లేని సంపన్న కొనుగోలుదారులను సృష్టించి తన కంపెనీలో పెట్టుబడులు పెట్టినవారిని మోసం చేశాడు. అసలు, నీల్ చంద్రన్ సంస్థలను కొనుగోలు చేసేందుకు ఏ సంపన్నులు ముందుకు రాలేదని, అంతా బోగస్ అని తేలింది. వసూలు చేసిన సొమ్ములో చాలా భాగాన్ని నీల్ చంద్రన్ ఇతర వ్యాపారాలకు మళ్లించాడని, అంతేకాకుండా, లగ్జరీ కార్లు కొనుగోలుకు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఉపయోగించాడని వెల్లడైంది. దాంతో అతడిపై పలు అభియోగాలు మోపిన పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అతడి నేరాలు నిరూపణ అయితే జీవితకాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది. అతనిపై మొత్తంగా 3 ఫ్రాడ్ కేసులతో పాటు అక్రమ లావాదేవీలు నిర్వహించినందుకు గాను మరో రెండు కేసులు నమోదయ్యాయి.