పాకిస్తాన్ లో పరిస్థితులు దిగజారాయి. తినడానికి తిండిలేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. గోధుమ పిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. పిండికి పెరిగిన రెట్లు, వ్యాపారులు బ్లాక్ చేయడంతో అక్కడ గోధుమ పిండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్( పీఓకే)లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్సుల నుంచి గోధుమల లోడ్ తో ఏదైనా ట్రక్కు వెళ్తే, బలూచిస్తాన్, పీఓకేకు చేరే అవకాశమే లేదు.. ఎందుకంటే మార్గం మధ్యలోనే ప్రజలు దాడి చేసి గోధుమ పిండిని ఎత్తుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి.
తాజాగా ఓ వీడియో పాకిస్తాన్ తో పాటు ఇండియాతో తెగ వైరల్ అవుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో గోధుమపిండి లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కును వందలాది మంది ప్రజలు బైకులతో వెంబడించడాన్ని గమనించవచ్చు. బైక్ ర్యాలీ తరహాలో ట్రక్కును వెంబడిస్తున్న ఈ వీడియో అక్కడి పరిస్థితులకు అద్దంపడుతోంది. దీనిని నేషనల్ ఈక్వాలిటీ పార్టీ జమ్మూ కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్ అధ్యక్షుడు సజ్జాద్ రజా ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పాకిస్తాన్ పరిస్థితులకు ఉదాహరణ అని, పీఓకే ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవండి, మనకు పాకిస్తాన్ తో భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా..? పాకిస్తాన్ మనపై వివక్ష చూపిస్తుందంటూ ట్విట్టర్ లో తన బాధను వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ లో ఎటూ చూసిన ఆకలి కేకలే కనిపిస్తున్నాయి. గోధుమ పిండి ధరలు అమాంతం పెరిగాయి. ఒక కిలో గోధుమ పిండి ధర రూ. 160 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల 10 కిలోల పిండి ధర పాకిస్తాన్ రూ. 3000గా ఉంది. ప్రభుత్వం రేషన్ పై ఇచ్చే గోధుమ పిండి కోసం కోట్లాటలు జరుగుతున్నాయి. తొక్కిసలాటల్లో ప్రజలు మరణిస్తున్నారు. ఒక్కో పిండి బస్తా కోసం ముగ్గురు చొప్పున గొడవపడుతున్న దృశ్యాలు అక్కడ దయనీయ స్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing a truck carrying wheat flour, hoping to buy just 1 bag. Ppl of #JammuAndKashmir should open their eyes. Lucky not to be #Pakistani & still free to take decision about our future. Do we have any future with🇵🇰? pic.twitter.com/xOywDwKoiP
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 14, 2023