పానీ పూరీ ప్రియులకు ఇది నిజంగా చేదు వార్త. సాయంత్రం అయితే, స్నాక్స్గా ఎంతో ఇష్టంగా తినే పానీ పూరీని బ్యాన్ చేశారు. అయితే.. అది మన దేశంలో కాదు, నేపాల్లోని ఖాట్మండు వ్యాలీలో! పానీ పూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో.. అక్కడ పానీ పూరీని నిషేధిస్తున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులో గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ఆ దేశంలో రోగుల సంఖ్య 12కు చేరింది. ఈ నేపథ్యంలోనే కలరా వ్యాప్తికి గల కారణాల్ని పరిశీలించగా.. పానీ పూరీ నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్టు తేలింది. దీంతో.. కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లో, కారిడార్ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కలరా లక్షణాలున్నట్టు కనిపిస్తే, సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని అధికారులు కోరారు. డయేరియా, కలరా వంటి వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తాయి కాబట్టి.. జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.