అన్ని అనుకున్నట్లు జరిగిగే యూకేకు కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునక్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జరిగిన రెండు రౌండ్లలో కూడా రిషి సునక్ ఇతర ప్రధాని అభ్యర్థుల కన్నా ముందుగా ఉన్నారు. ప్రజల నుంచి కూడా మద్దతు కూడగడుతున్నారు. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ఎదురైన అవినీతి ఆరోపణలపై రాజీనామా చేశాడు. దీంతో బ్రిటన్ కు కొత్తగా ప్రధానితో పాటు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ప్రధాని బోరిస్ జాన్సన్ తన వారసుడి కోసం జరుగుతున్న ఎన్నికల్లో రిషి సునక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రధానిగా రిషి సునక్ కు తప్పా మరెవరికైనా మద్దతు ఇవ్వాలని ఎంపీలకు చెబుతున్నట్లు శుక్రవారం బ్రిటిష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధాని ఎవరైనా మంచిదే కానీ.. రిషి మాత్రం కాకూడదనే గట్టి పట్టుదలతో బోరిస్ జాన్సన్ తన వర్గం ఎంపీలకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోటీలో బహిరంగంగా జోక్యం చేసుకోనని గతంలో బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించాడు. అయితే అంతర్గతంగా మాత్రం రిషి సునక్ ప్రధాకి కాకుండా ఎత్తుగడలు వేస్తున్నాడు.
ప్రస్తుతం యూకే ప్రధాని రేసులో రిషి సునక్ తో పాటు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, మాజీ మంత్రి కెమి బాడెనోచ్, టోరీ బ్యాక్బెంచర్ టామ్ తుగేన్ధాట్ ఉన్నారు. ఈ వారం వీరంతా టీవీ చర్చలో పాల్గొననున్నారు. రిషి సునక్ కు బదులు పెన్నీ మోర్డాంట్ కు మద్దతు ఇవ్వాలని బోరిస్ జాన్సన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిషి సునక్ తనకు ద్రోహం చేశారనే ఆగ్రహంలో బోరిస్ జాన్సన్ ఉన్నాడని తెలుస్తోంది. తను రాజీనామా చేయడంలో రిషి సునక్ కీలక పాత్ర పోషించాడని.. మంత్రులను దూరం చేశాడని బోరిస్ జాన్సన్ కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కారణంగానే రిషి సునక్ తప్పా ఎవరు ప్రధాని అయినా ఓకే అని బోరిస్ జాన్సన్ ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది.