మలేషియాకు చెందిన 83 ఏళ్ల మహిళ, ఆమె భర్త అత్యంత విషపూరితమైన ‘‘పఫర్ ఫిష్’’ ను తిని ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ చేపను తిన్న తర్వాత భార్య చనిపోగా, భర్త ఐసీయూలో కోమాలో ఉన్నాడు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. వీరి కుమార్తె చెప్పిన దాని ప్రకారం సమీపంలో ఉన్న మార్కెట్ నుంచి ఈ డెడ్లీ చేపను తన తండ్రి కొనుగోలు చేసినట్లు బాధితుల కుమార్తె వెల్లడించారు. తన తండ్రి చాలా ఏళ్లుగా ఒకే చేపల వ్యాపారి నుంచి చేపలను కొనుగోలు చేస్తున్నారని, ఇలాంటి చేపను తింటే ప్రమాదంలో పడతామని వారికి తెలియదని కుమార్తె చెప్పింది.
పఫర్ చేపను దంపతులు మధ్యాహ్న భోజనంలో తీసుకున్న తర్వాత కొద్ది సేపటికే మహిళ లిమ్ సీవ్ గ్వాన్ శరీరం వణకడంతో పాటు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారింది. కొన్ని గంటల తర్వాత ఆమె భర్తకు కూడా ఇలాంటి లక్షణాలే కనిపించాయి. వెంటనే వారి కుమారుడు తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించగా తల్లి మరణించింది. ప్రస్తుతం తండ్రి ఐసీయూలో కోమాలో ఉన్నాడు.
పఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైన, రుచికరమైన చేప. దీన్ని వండేందుకు సుక్షితులైన వంటగాళ్లు ఉంటారు. అవగాహన లేకుండా వండితే దాదాపుగా ప్రాణాలు పోతాయి. ముఖ్యంగా జపాన్ దేశంలో ఈ పఫర్ చేపను ఇష్టంగా తింటారు. ఈ దేశంలో ఈ చేపను వండేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చేపలో అత్యంత విషపూరితమైన సిగ్వేటరా టాక్సిన్ లేదా టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే శక్తివంతమైన విషాలు ఉంటాయి. ఇది కార్డియాక్ డిస్రిథ్మియా, శ్వాసకోశ వైఫల్యం, న్యూరోలాజికల్ గా ప్రభావం చూపిస్తుంది. ఈ విషాలను తొలగించడం ట్రైన్డ్ చెఫ్ లకే సాధ్యం అవుతుంది.