దొరికింది కదా అని.. అమ్మాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు.. కౌగిట్లో నలిపేశాడు.. కానీ, ఓ ఏడాది తర్వాత దూల తీరింది.. భారీగా పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది.. కౌగిలింత అనేది మనిషిలోనే టెన్షన్ను దూరం చేస్తుంది అంటారు.. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా చెప్పుకునే కౌగిలింతతో.. అప్పటి వరకు ఉన్న బాధలు మరిచి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయంటారు.. లింగ బేధం లేకుండా సందర్భాన్ని బట్టి, అభినందించే సమయాన్ని బట్టి కూడా కౌగిలింతలు ఇస్తుంటారు.. అయితే, ఓ మహిళ.. కౌగిలింతపై కోర్టుకు వెళ్లడం.. కోర్టు భారీగా జరిమానా విధించడం ఆసక్తికరంగా మారింది.. కొలిగ్ తనను గట్టిగా కౌగిలించుకున్నాడని కోపగించుకున్న మహిళ.. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ ఘటన చైనాలో జరిగింది.
2021 సంవత్సరంలో మేలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని యుయాంగ్ నగరంలోని హునాన్ ప్రావిన్స్కు చెందిన మహిళ తన కార్యాలయంలో సహోద్యోగితో చాట్ చేస్తుండగా, ఒక మగ సహోద్యోగి ఆమె వద్దకు వచ్చి ఆమెను చాలా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింత నొప్పితో కేకలు వేసింది సదరు మహిళ… ఆమె ఛాతీలో అసౌకర్యాన్ని కలిగించింది.. ఉపశమనం కోసం.. తాత్కాలికంగా కొన్ని ఆయిల్ మసాజ్లు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. 5 రోజుల తర్వాత మహిళ ఛాతీలో నొప్పి మరింత తీవ్రమవ్వడంతో ఆస్పత్రికి వెళ్లింది. వైద్యుడు టెస్ట్లు చేయడంతో.. ఎక్స్రేలో మహిళకు మూడు పక్కటెముకలు విరిగినట్టు తేలింది. కుడి వైపున రెండు, ఎడమ వైపున ఒకటి విరిగిపోయాయని చెప్పారు..
ఇక, ఆ మహిళ ఉద్యోగానికి కూడా వెళ్లలేని పరిస్థితి.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా.. భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది.. ఇక, తన పరిస్థితిని తనను కౌగిలించుకున్న వ్యక్తికి వివరించింది బాధితురాలు.. నీ కౌగిలింత వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందని విన్నవించింది.. కానీ, అతడు మాత్రం.. తన కౌగిలింతవల్లే ఇంత జరిగిందా? దానికి రుజువు ఏంటి? అని రివర్స్ ఎటాక్కు దిగాడు.. ఇక, చేసేది ఏమీ లేక.. తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది బాధిత మహిళ.. తన ఆర్థిక నష్టాలకు పరిహారం కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు.. 10,000 యువాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1.16 లక్షలు పరిహారంగా చెల్లించాలని న్యాయమూర్తి సహోద్యోగిని ఆదేశించారు.. ఇక, ఆ ఐదు రోజుల్లో ఎముకలు విరగడానికి కారణమయ్యే కార్యకలాపాల్లో మహిళ పాల్గొన్నట్టు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. కౌగిలించుకోవాలి.. దాంట్లో ప్రేమ, ఆప్యాయత ఉండాలి.. కానీ, ఇంత మొరటుగా ఏందిరా అయ్యా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తంగా కౌగిలింత.. కోర్టు ఫైన్ వ్యవహారంలో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.