గతంలో కొన్ని సందర్భాల్లో.. రాజకీయాల్లో ఉన్న తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం పవన్ పాలిటిక్స్తో తనకు సంబంధమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును.. తన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిరు పరోక్షంగా పవన్కి తాను మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా పవన్కి తన మద్దతు ఉండదని, పాలిటిక్స్కి తాను పూర్తిగా దూరంగా ఉంటానని క్లారిటీ ఇచ్చేశారు. పవన్తో కలిసినప్పుడు కూడా తమ మధ్య పాలిటిక్స్కి సంబంధించిన చర్చలేమీ జరగవని స్పష్టం చేశారు.
ఏపీలో రాజకీయాలకు, సినిమాలకు మధ్య ఎలాంటి క్లాష్ లేదని తెలిపారు. పవన్ పాలిటిక్స్ కూడా తమపై ఎలాంటి ప్రభావం లేదని, ఒకవేళ ఉంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ఇబ్బందులు తలెత్తేవి కదా? అని సమాధానం ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అదనపు షోస్ వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. ఇందుకు తాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 2024 ఎన్నికల్లో తాను ఎలాంటి పొలిటికల్ స్టాండ్ తీసుకోనని, ఇందులో 100% సందేహమే లేదని చిరంజీవి బల్లగుద్దిమరీ చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులు మారుతుంటారని, అలా మారడం కూడా మంచి పరిణామమేనని చిరు చెప్పారు.
ప్రస్తుతం తానిప్పుడు సౌమ్యంగా ఉన్నంతమాత్రాన గతంలోనూ ఇలాగే ఉన్నానని అర్థం కాదని, కాలానికి అనుగుణంగా మారడం తనకు కంఫర్టబుల్గా ఉంటుందన్నారు. పవన్, నాగబాబు ఇప్పుడు ఫీరోషియస్గా ఉండటం అనేది వాళ్లకు అడ్వాంటేజ్ అని చెప్పుకొచ్చారు. బహుశా తనపై ‘రాజకీయ’ ముద్ర పూర్తిగా చెరిపోసుకోవడం కోసమే చిరు ఇలా బ్యాక్స్టెప్ తీసుకొని ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.