ఢిల్లీలోొ జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ సమాయత్తం అవుతోంది. 2024, జూన్ వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడగించింది. దీంతో పాటు ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు కేవలం 400 రోజులు మాత్రమే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకులెకు దిశానిర్ధేశం చేశారు. ఈ 400 రోజులు బీజేపీకి కీలకం అని సూచించారు. కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ పాదయాత్రను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ 400 రోజుల్లో ప్రజలకు, ఓటర్లకు చేరువ కావాలని కోరారు. 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లపై దృష్టి పెట్టాలని మోదీ అన్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. వారికి చరిత్ర, గత ప్రభుత్వాలు ఏమి చేశాయో తెలియదని.. మనం వారికి అవగాహన కల్పించాలని, సుపరిపాలనలో భాగం కావడానికి వారికి సహయపడాలని మోదీ సూచించినట్లు వెల్లడించారు.
మోదీ, జేపీ నడ్డాల సారథ్యంలో 2024 ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, మణిపూర్, గోవా ఎన్నికల్లో గెలిచామని.. ఆయన నేతృత్వంలో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బలపడ్డామని వెల్లడించారు. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అమిత్ షా అన్నారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేసింది బీజేపీ. ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలం పెంచుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం బీజేపీ ఎదుగుదలకు బాగుంటుందని ఆ పార్టీ భావిస్తోంది.