కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివాదాస్పద “రాష్ట్రపత్ని” వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. “నోరు జారి అలా మాట్లాడానని హామీ ఇస్తున్నాను. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతున్నాను. మా క్షమాపణలను అంగీకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.” అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు.
రాష్ట్రపతి అవమానించాలని అలా అనలేదని.. పొరపాటుగా నోరు జారినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రపతికి బాధా అనిపిస్తే తానే స్వయంగా ఆమెను కలుసుకుని క్షమాపణలు చెబుతానన్నారు. కావాలంటే తనను ఉరితీయొచ్చని.. తాను శిక్షకు సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు ఇందులోకి లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటున “రాష్ట్రపత్ని” అనే పదాన్ని ఉపయోగించానని, అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా దీనిని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తోందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై లోక్సభ ఎంపీ అధీర్ చౌదరి చేసిన ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు పార్లమెంట్లో నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవిని అవమానపరిచిందని.. ఆ పార్టీ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ లోక్సభలో డిమాండ్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ ఆమోదించాలంటూ ఆమె మండిపడ్డారు.