భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు హనీ ట్రాప్ లతో ఆర్మీ జవాన్లను, అధికారులు బుట్టలో వేసుకుంటోంది. అందమైన యువతులు పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ తరుపున పనిచేస్తూ.. జవాన్లను వలలో వేసుకుంటున్నారు. యువతుల మోజులో పడి మన జవాన్లు ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి చేరవేస్తున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారమే మరోసారి జరిగింది. రాజస్తాన్ లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ శాంతిమోయ్ రాణా..ఐఎస్ఐకి సంబంధించిన ఇద్దరు మహిళ ఏజెంట్ల వలలో చిక్కుకున్నాడు. ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వారితో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడిని ఆర్మీ అరెస్ట్ చేసింది.
రాణా మార్చి 2018లో ఆర్మీలో చేరాడు. రాజస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆర్మీ జవాన్ శాంతిమోయ్ రాణా ఇద్దరు మహిళలకు టచ్ లో ఉన్నాడని.. రెండేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచమైన మహిళతో సంబంధాలు పెట్టుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం… ‘ ఆపరేషన్ సర్హద్’లో భాగంగా పాక్ గూఢాచర్య కార్యకలాపాలకు పాల్పడుతోందని.. పశ్చిమ బెంగాల్ కు చెందిన బంకురాలోని కంచన్ పూర్ వాసి రాణా( 24) సదరు మహిళ ఏజెంట్లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని సున్నితమైన సమాచారాన్ని అందించారని అన్నారు. హనీట్రాప్ ఆరోపణన నేపథ్యంలో రాణా ఎలాంటి సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించారనే వివరాలను రాబట్టే పనిలో ఉంది ఆర్మీ. జూలై 25న రాణాలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
విచారణలో కీలక విషయాలను రాణా వెల్లడించారు. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో పనిచేస్తున్నట్లు చెప్పుకున్న మహిళ ఏజెంట్.. మొదట తన పెరును గర్నూర్ కౌర్ అలియాస్ అంకితగా.. యూపీలోని షాజహాన్ పూర్ నివాసిగా చెప్పుకుందని.. మరో ఐఎస్ఐ ఏజెంట్ నిషాతో కూడా రాణా సంప్రదింపులు నడిపారు. నిషా మిలిటరీ నర్సింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నట్లు చెప్పిందని.. రాణా అధికారులకు వెల్లడించారు. అతన్ని హనీ ట్రాప్ చేసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆర్మీకి సంబంధించిన రహస్య పత్రాలను , ఫోటోలను అడగటం ప్రారంభిచారని.. ఇంటలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్. సెంగతీర్ వెల్లడించారు.