రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు సహాయ పడుతుందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దీని సంబంధించిన వివరణను నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించినట్లు తెలిపింది. ఈనేపథ్యంలో 184 మంది వాలంటీర్లపై కొవాగ్జిన్ టీకా బూస్టర్ డోసు ప్రయోగం నిర్వహించి నట్లు వెల్లడించారు. అయితే రెండు డోసుల టీకా తీసుకున్న ఆరు నెలల తర్వాత వారికి బూస్టర్ డోసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. సగం మందికి నిజమైనా టీకా, మిగిలిన వారికి ప్లాసిబో ఇచ్చి ఫలితాలను విశ్లేసించి, బైండింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి, ఆర్బీడీ, ఎన్ ప్రొటీన్, మెమొరీ టీ – సెల్, సెల్ రెస్పాన్స్ మొదలగు అంశాలను పరిశీలించారు.
ఈనేపథ్యంలో.. కొవిడ్ వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వేరియంట్లను కొవాగ్జిన్ టీకా సమర్థంగా ఎదుర్కొన్నట్లు తేలింది. దీంతో కొవాగ్జిన్ టీకా తీసుకున్న కొంతకాలానికి యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ.. టీసెల్ ప్రతిస్పందన మాత్రం 12 నెలల పాటు కనిపించినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనివల్ల దీర్ఘకాలం పాటు బి-సెల్ మెమొరీ కూడా సాధ్యపడుతోందని వివరించింది. తొలి రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో ఆరు నెలల తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గుతోందని.. కానీ, బూస్టర్ డోసు తీసుకుంటే అనూహ్యంగా పెరుగుతోందని వెల్లడించింది. అయితే.. ఆ సమయంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. దీర్ఘకాలంపాటు వైరస్ నుంచి రక్షణ లభిస్తోందన్నారు. ఈనేపథ్యంలో.. ఒకే రకమైన డోసును పిల్లలు, పెద్దల్లో వేసేందుకు అనువైన టీకా కావడం.. ప్రైమరీ- బూస్టర్ డోసుగా వినియోగించే అవకాశం ఉండటంతో ఇది సార్వత్రిక టీకాగా రూపుదిద్దకున్నట్లు, భారత్ బయోటెక్ వద్ద ప్రస్తుతం 5 కోట్ల డోసుల టీకా పంపిణీకి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.