బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని, వారు దేశాన్ని నిరక్షరాస్యుల లాగే ఉంచాలని చూస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మూసివేసినట్లే దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అనేక ప్రైవేట్ పాఠశాలలను కూడా మించినవి ఉన్నాయన్నారు.
ఢిల్లీలో ఆప్ నేతృత్వంలోని పాలనను కూల్చివేయాలని బీజేపీ తహతహలాడుతోందని, తన నివాసంపై సీబీఐ దాడులు ఫలించలేదని, కేంద్రంలోని బీజేపీ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లోపాలను ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. 10 రోజుల సీబీఐ దాడులు జరిగినా ఏం తేలింది చెప్పండి.. మద్యం కుంభకోణంలో ఏమీ బయటకు రాకపోతే, పాఠశాలల నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని వారు (బీజేపీ) చెబుతున్నారని ఢిల్లీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. “ఇవన్నీ అబద్ధం, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి” అని పేర్కొన్నారు. ఇది నిరక్షరాస్యుల పార్టీ అని, దేశం మొత్తాన్ని నిరక్షరాస్యులుగా ఉంచాలని చూస్తోందని, పాఠశాల అవినీతిపై వారికి ఆసక్తి లేదని బీజేపీపై ఘాటుగా దాడి చేశారు.
ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్కు ఆప్ చేసిన కృషిని కొనియాడుతూ, “2015 నుంచి 700 కొత్త పాఠశాల భవనాలను కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్మించింది. ఈ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయి.” అని సిసోడియా పేర్కొన్నారు. ఫైళ్లపై సీఎం కేజ్రీవాల్ సంతకం లేకపోవడం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తిరిగి ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ, ఇది సాధారణ ప్రక్రియ అని అన్నారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ లాగా ప్రవర్తించండి సార్’ అని మనీష్ సిసోడియా అన్నారు