గుజరాత్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించే దిశగా వెళ్తోంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉంటే.. బీజేపీ ఏకంగా 158 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ దారుణంగా చతికిల పడింది కేవలం 15 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ 150 కన్నా ఎక్కువ సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ రాష్ట్రంలో ఇంత భారీ మెజారిటీ రాలేదు. 1995లో 121 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. 1998లో 117 స్థానాల్లో, 2002లోొ 127 స్థానాల్లో, 2007లో 117 స్థానాల్లో, 2012లో 115 స్థానాల్లో 2017లో 99 స్థానాల్లో గెలిచింది. ఈ సారి ఏకంగా 150కి పైగా స్థానాలను సాధించబోతోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న గిరిజన ప్రాంతాలు ఆ పార్టీ పెద్ద షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ బలంగా ఉన్న ఆ ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. 1950 నుంచి గిరిజన ప్రాంతంలో దాదాపుగా ప్రతీ సీటును కైవసం చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి తొలిసారిగా దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. మొత్తం గుజరాత్ జనాభాలో గిరిజన జనాభా 89.17 లక్షల మంది అంటే దాదాపుగా 15 శాతం మందిా ఉన్నారు. మొత్తం 14 జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట కాంగ్రెస్ ను కాదని ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. దీంతోనే బీజేపీ భారీ మెజారిటీ సాధించింది.