బీజేపీ ‘‘ సాలు దొర- సెలవు దొర’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు డిజిటల్ బోర్డు పెట్టి మీరీ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారం ముగిసే వరకు కౌంట్ డౌన్ ప్రారంభించింది. సాలు దొర సెలవు దొర పేరుతో ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తోంది.
అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి షాక్ ఇచ్చింది. సాలు దొర- సెలవు దొర ప్రచారంపై ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. సీఎం కేసీఆర్ పై ప్రచారాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఎం బొమ్మతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ‘‘సాలు దొర- సెలవు’’ దొర ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం బీజేపీ నేతలు సంప్రదించారు. అయితే ఈ ప్రచారంపై బీజేపీ విజ్ణప్తిని ఈసీ తోసిపుచ్చింది.
ఈ నిర్ణయంతో బీజేపీ పార్టీకి షాక్ తగిలినట్లు అయింది. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతల విమర్శలను, ప్రచారాన్ని టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు తిప్పి కొడుతున్నారు. ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ధరల పెరుగుదల, గ్యాస్ ధర పెంపు, నిరుద్యోగం వంటి అంశాలపై ‘‘ సాలు మోదీ-సంపకు మోదీ’’ అంటూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది.