రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు బెదిరింపులు జారీ చేసినందుకు ఒక వ్యక్తిని ముంబై పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అఫ్జల్ అనే వ్యక్తి ఈ ఉదయం ముంబైలోని గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లోని ల్యాండ్లైన్ నంబర్కు మూణ్నాలుగు సార్లు బెదిరింపు కాల్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్ చేసిన ఫోన్ నంబర్ సాయంతో నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసి ప్రస్తుతం ఆ వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ ముకేష్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతేడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్సుఖ్ హీరేన్ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్స్పెక్టర్ సచిన్ వాజే దర్యాప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.