ఇండియాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు కేసుల తీవ్రత ఎక్కువ అవుతోంది. రెండు నెలల క్రితం రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు దిగువనే ఉండేది కానీ.. ఇప్పుడు రోజూ 20 వేల కన్నా ఎక్కువ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. దీంతో పాటు తెలంగాణలో కూడా కరోనా కేసులు 500కు మించి నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 20,279 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 18,143 మంది వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక రోజులో 36 మంది మరణించారు.
ప్రస్తుతం దేశంలో 1,52,200 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మొదలైనప్పటి నుంచి గణాంకాలను పరిశీలిస్తే .. ఇప్పటి వరకు దేశంలో 4,38,88,775 కరోనా కేసులు నమోదు అవ్వగా.. ఇందులో 4,32,10,522 కోలుకోగా..5,26,033 మంది మరణించారు. భారతదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఇటీవలే 200 కోట్ల డోసులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఇండియాలో అర్హులైన వారికి 201.99 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులును అందించారు. శనివారం ఒక్క రోజే 28,83,489 మందికి టీకాలు ఇచ్చారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. జపాన్ లో నిన్న ఒక్క రోజే లక్షకు పైగా 1,96,297 కేసులు నమోదు అయ్యాయి. ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇటలీల్లో కూడా 50 వేలకు మించి కేసులు నమోదు అయ్యాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రపంచంలో 57,44,21,319 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 64,02,173 మంది మరణించారు.