కరోనా దేశాన్ని వణికిస్తోంది. వరసగా కొన్ని రోజుల నుంచి దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతంలో కేవలం రోజూవారీ కేసులు సంఖ్య 5 వేలకు తక్కువగానే నమోదు అవుతుండేవి. అయితే గత నెలన్నర కాలం నుంచి 15 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య 20 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. దీంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది.
తాజాగా శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,044 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 56 మంది కరోనా బారినపడి మరణించారు. గత 24 గంటల్లో 18,301 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,40,760 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.80 శాతంగా ఉంది. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో ఇప్పటి వరకు 4,37,30,071 కేసులు నమోదు కాగా..4,30,63,651 మంది కోలుకోగా.. 5,25,660 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.32 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.48 శాతంగా.. డెత్ రేట్ 1.20గా ఉంది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లకు చేరుకుంది. గతేడాది జనవరిలో ప్రారంభం అయిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా.. దేశంలో అర్హులైన వారికి 199,71,61,438 డోసుల వ్యాక్సినేషన్ అందించారు. నిన్న ఒక్క రోజే ఇండియాలో 22,93,627 వ్యాక్సిన్ వేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసులు పరిశీలిస్తే అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 56,62,16,104 కు చేరింది. మొత్తం 63,85,632 మరణించారు.