దేశంలో నెమ్మదిగా మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరగుతోంది. తాజాగా మరో కేసు కూడా దేశంలో నమోదు అయింది. ఢిల్లీలో ఓ నైజీరియన్ జాతీయుడికి ఈ వ్యాధి సోకింది. 35 ఏళ్ల నైజీరియన్ గత ఐదు రోజులుగా శరీరంపై దద్దర్లు, జ్వరం రావడంతో ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి)కి పంపారు. తాజాగా సోమవారం వచ్చిన రిపోర్టులో అతనికి పాజిటివ్ గా తేలింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే తాజాగా వ్యాధి సోకిన వ్యక్తికి ఎలాంటి ప్రయణాలు చేసిన చరిత్ర లేదు. అయినా కూడా మంకీపాక్స్ ఎలా సోకింది అర్థం కావడం లేదు. గతంలో ఢిల్లీలో నమోదైన కేసులో బాధితుడికి కూడా ట్రావెల్ హిస్టరీ లేదు.
దేశంలో ఇప్పటి వరకు 6 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఢిల్లీలో 2 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఢిల్లీలో వచ్చిన రెండు కేసులు కూడా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికే వచ్చింది. బాధితులిద్దరు ఢిల్లీని వదిలి ఇతర దేశాలకు కానీ.. ఇతర ప్రాంతాలకు కానీ ప్రయాణించిన చరిత్ర లేదు. ఇక కేరళలో వచ్చిన మూడు మంకీపాక్స్ కేసుల్లో బాధితులంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారే. తాజాగా కేరళ త్రిస్సూర్ కు చెందిన వ్యక్తి మంకీపాక్స్ తో బాధపడుతూ మరణించాడు. దీంతో దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. ప్రస్తుతం మరణించిన వ్యక్తితో సంబంధం ఉన్న మొత్తం 20 మంది కేరళ ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల్లో 18000కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్క స్పెయిన్ దేశంలోనే మంకీపాక్స్ తో ఇద్దరు మరణించారు. స్పెయిన్ తో పాటు బ్రిటన్, బెల్జియం దేశాల్లో ఎక్కవ మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. యూరోపియన్ దేశాల్లోనే 70 శాతం మంకీపాక్స్ కేసులు నమోదు కాగా.. అమెరికా ప్రాంతంలో 25 శాతం మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల కాలంలో మంకీపాక్స్ కేసులు తీవ్రత పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. న్యూయర్క్ లో మంకీపాక్స్ వల్ల ఎమర్జెన్సీ విధించారు అమెరికా అధికారులు.