వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే సహాయాన్ని కోరాడు. దేశాన్ని వదిలి ప్రవాసంలో బతుకున్న నిత్యానంద తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నిత్యానంద శ్రీలంక రాజకీయ ఆశ్రయం కోరుతున్నారు. నిత్యానంద ఆరోగ్యం క్షీణించడంతో.. చికిత్స కోసం శ్రీలంక సాయాన్ని అభ్యర్థిస్తూ రణిల్ విక్రమసింఘేకు లేఖ రాశాడు. దీంతో పాటు తన ద్వీప దేశం శ్రీకైలాసలో వైద్యపరమైన మౌళిక సదుపాయాల కొరతను లేఖలో ప్రస్తావించాడు.
నిత్యానంద తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని సమాచారం. చికిత్స చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. శ్రీకైలాస విదేశాంగ మంత్రిగా చెప్పుకునే నిత్య ప్రేమాత్మ ఆనంద స్వామి ఈ లేఖను రాశాడు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో వైద్యం కోసం, రాజకీయ ఆశ్రయం గురించి శ్రీలంకను అభ్యర్థించినట్లు తెలుస్తోంది. శ్రీ కైలాస దేశంతో దౌత్య సంబంధాలు ప్రారంభించాలని శ్రీలంకను లేఖలో అభ్యర్థించాడు. కైలాస రాజ్యంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేవని.. తనకు వైద్యం అందిచాలని.. ఎంత ఖర్చైనా భరిస్తామని లేఖలో పేర్కొన్నాడు నిత్యానంద.
కర్ణాటకలోని ఓ ఆశ్రయంలో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. 2018లో దేశాన్ని వదిలి పారిపోయాడు. లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి కైలాస దేశంగా పేరుపెట్టాడు. తనకు తాను దేశ ప్రధానిగా ప్రకటించుకుని.. మంత్రి మండలిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కైలాస దేశంలో రిజర్వ్ బ్యాంక్ ను ఏర్పాటు చేసుకుని కైలాస డాలర్ కరెన్సీని తీసుకువచ్చాడు. ఏకంగా తమ కైలాస దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరాడు నిత్యానంద. నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. 2010లో అత్యాచార అభియోగాలతో పట్టుబడ్డాడు. ఆ తరువాత జైలు శిక్ష అనుభవించిన నిత్యానంద బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఆ తరువాత దేశాన్ని వదిలిపోయాడు.