రాహుల్ గాంధీకి మరోసారి ఎదురుదెబ్బ తలిగిలింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. మోడీ ఇంటిపేరు వివాదంలో క్రిమినల్ పరువునష్టం కేసులో సూరత్ హైకోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్థారించి 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాతే పిటిషన్ పై కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. తన పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులను ప్రకటించే వరకు కింది కోర్టు ఇచ్చిన శిక్షపై మధ్యంతర స్టే విధించాలని రాహుల్ గాంధీ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరుపున వాదించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మధ్యంతర స్టే అత్యవసరం అని న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. అయితే ఈ దశలో ధ్యంతర రక్షణ కల్పించలేమని జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ పేర్కొన్నారు. రికార్డులు, ప్రొసీడింగ్స్ పరిశీలించిన తర్వాతే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ అన్నారు. మే 8 నుంచి జూన్ 3 వరకు కోర్టుకు వేసవి కాలం సెలువులు ఉన్నాయి. ఆ తరువాత రాహుల్ గాంధీ శిక్షపై గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
2019 ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, మోడీ ఇంటిపేరు ఉన్నవాళ్లంతా దొంగలే అని అర్థం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువునష్టం కేసు ఫైల్ చేశాడు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే ప్రజాప్రతినిధ్య చట్టం -1951 ప్రకారం తన పదవికి అనర్హుడు అవుతాడు. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ పదవి పోయింది.