నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజనైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోసారి విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా వెంట రాగా సోనియా గాంధీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని రెండు రోజుల్లో దాదాపు 55 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. రాహుల్ గాంధీని అడిగిన ఇలాంటి ప్రశ్నలే ఆమెను అడిగారని తెలుస్తోంది.
రెండోసారి విచారణలో భాగంగా మంగళవారం ఉదయం 11గంటలకు మొదలైన దర్యాప్తు.. మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. అనంతరం గంటన్నర పాటు లంచ్ విరామం ఇచ్చారు. తర్వాత 3.30కు తిరిగి విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు సాయంత్రం 7గంటల వరకు సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్పై ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 6 గంటల దాకా విచారణ కొనసాగగా… 6 గంటల సమయంలో మంగళవారం నాటి విచారణ ముగిసినట్లు అధికారలు ప్రకటించడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం కూడా విచారణకు రావాలని సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ సమయంలో సోనియా గాంధీకి సహాయకారిగా ఉండేందుకు ప్రియాంక గాంధీకి అనుమతి ఇవ్వగా.. ఆమెను ప్రశ్నిస్తున్న సమయంలో ప్రియాంకను వేరే గదిలో కూర్చోబెట్టినట్లు సమాచారం. ఈ విచారణ ముగిసే వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. సోనియాగాంధీ విచారణ ముగిసిన అనంతరం రాహుల్తో సహా వివిధ పోలీస్ స్టేషన్ల నిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు.