ఎన్నో ఏళ్లుగా జమ్ముకశ్మీర్లో ఉగ్రమూకల దాడులు అక్కడి ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల్లో క్రమంగా ఉగ్రవాదంపై చైతన్యం వస్తోంది. జమ్ము కశ్మీర్లోని ప్రజల్లో ఉగ్రవాదంపై చైతన్యం వస్తోందని చెప్పడానికి ఈ ఘటనను ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ఆదివారం జమ్ముకశ్మీర్లోని రెయిసీ జిల్లాలో గల టక్సన్ గ్రామంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు బంధించి పోలీసులకు అప్పగించారు. వీరిలో లష్కరే కమాండర్ తాలిబ్ హుస్సేన్ కూడా ఉన్నాడు. ఇతను రాజౌరీ జిల్లాకు చెందినవాడు. ఇటీవల ఆ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుళ్ల వెనుక ఇతడి హస్తం ఉంది. మరో ఉగ్రవాది ఫైజల్ అహ్మద్ దార్ దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాకు చెందినవాడు. ఇతడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్, ఏడు గ్రనేడ్లు, పిస్తోల్ను స్వాధీనం చేసుకొన్నారు. వీరిద్దరిని పోలీసులకు అప్పగించారు. టక్సన్ గ్రామస్థులు ఎంతో ధైర్యం చేసి ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదులను పోలీసులకు అప్పగించించారు. వారి ధైర్య సాహసాలను అధికారులతో పాటు దేశప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఆ గ్రామస్థుల ధైర్య సాహసాలకు గుర్తింపుగా అడిషనల్ డీజీపీ రూ.2 లక్షల బహుమానాన్ని ప్రకటించారు. దీనికి అదనంగా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హా మరో రూ.5 లక్షలను గ్రామస్థులకు బహుమానంగా ప్రకటించినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ఏడీజీపీ జమ్ము ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేశారు. టక్సన్ గ్రామస్థులకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.