ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్పుర్, వారణాసి నగరాల్లోని వినియోగదారులు 5జీ+ సేవలను ఆనందించొచ్చని ఎయిర్టెల్ తెలిపింది. ఈ సేవలను పొందేందుకు సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్ ఉంటే సరిపోతుందని ఎయిర్టెల్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో 5జీ ప్లస్ సేవలను పొందొచ్చని ఎయిర్టెల్ తెలిపింది. 5జీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేంత వరకు 4జీ ప్లాన్లతోనే హైస్పీడ్ డేటా సేవలు పొందొచ్చని పేర్కొంది. అయితే, 5జీ ఫోన్లన్నీ ఎయిర్టెల్ 5జీకి సపోర్ట్ చేయకపోవచ్చని, దీనికి సంబంధించి మొబైల్ తయారుదారులు ఓటీఏ అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది.
దేశంలో తన 5G నెట్వర్క్ ను ప్రారంభించడాన్ని జియో అధికారికంగా ధ్రువీకరించినప్పటికీ ఈ సేవలు దీపావళి నుండి ఎంపిక చేసిన సీటీస్లో మాత్రమే ప్రారంభమవుతాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం జియో 5G ఇతర ప్రాంతాలకు విడుదల చేయడానికి ముందు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలలో ప్రారంభించనుంది. అయితే, కంపెనీ తన ‘ట్రూ-5G సేవల’ బీటా ట్రయల్ను దసరా సందర్భంగా ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబై, ఢిల్లీ, కోల్కతా, వారణాసి సహా నాలుగు నగరాల్లో దసరా సందర్భంగా 5G సామర్థ్యాలను పరీక్షించనుంది.
దేశంలో నెట్వర్క్ విస్తరించడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని అంచనా వేస్తున్నారు. జియో ట్రూ 5జీ వెల్కం ఆఫర్ కింద ఈ పైన పేర్కొన్న నగరాలలో జియో యూజర్లకు బీటా ట్రయల్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు 5జీ అన్లిమిటెడ్ డేటాను 1 జీబీపీఎస్ వేగంతో పొందొచ్చని పేర్కొంది. జియోకు అతిపెద్ద ప్రత్యర్థిగా ఎయిర్టెల్ ఉండబోతోంది. దేశంలో 5G సేవలను ప్రారంభించిన మొదటి కంపెనీగా అవతరించింది. మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా అందుబాటులోకి వస్తాయని ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. కాబట్టి, ప్రస్తుతం ఎయిర్టెల్ రేసులో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, జియో దేశవ్యాప్త కవరేజీని మరింత వేగంగా అందించాలని ప్లాన్ చేస్తోంది.