వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే చాలామంది నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతుండగా జగన్ కు తాజాగా కాకినాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న చెలమలశెట్టి సునీల్ షాకిచ్చారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జ్గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. ఈ వార్తలకు ఊతం ఇస్తూ నిన్న సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సునీల్ కలిశారు. టీడీపీలో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అక్టోబర్ నెల రెండో వారంలో చంద్రబాబు సమక్షంలో సునీల్ టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. చలమశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. గతంలో కూడా ఈ ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈసారి ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేషరతుగా పార్టీలో చేరతానని సునీల్ ప్రతిపాదించడంతో ఆయన చేరికకు చంద్రబాబు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. సునీల్ గతంలో రెండుసార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అలాగే గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రస్తుత కాకినాడ ఎంపీ తోట నరసింహం చేతిలో 3వేల ఓట్లతో ఓడిపోయారు.