కేవలం తాము అవినీతికి అడ్డుపడుతున్నందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహంతో ఊగిపోతుందని... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈరోజు ఆయన ఒడిశాలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలంగిర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ‘ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రజలకు అందాల్సిన నిధులను మధ్యవర్తులే దోచుకునేవారు. ఈ తీరుకి మేము అడ్డుకట్ట వేశాం. అవినీతిని అడ్డుకున్నామని ప్రతిపక్షం ఆగ్రహంతో ఉంది. పేదల డబ్బును దోచుకున్న ఎవ్వరినీ ఈ కాపలాదారుడు వదలడుగాక వదలడు.. శిక్షిస్తాడు. మేము పిల్లలకు విద్య, యువతకు ఉద్యోగాలు, పెద్దవారికి వైద్యం, రైతులకు నీరు అందించడం కోసమే పనిచేస్తున్నాం’ అని తెలిపారు.
అలాగే ‘గత ప్రభుత్వం సుల్తాను రీతిలో పాలన కొనసాగించింది. దేశ గొప్ప సంస్కృతిని నిర్లక్ష్యం చేసింది. మన ప్రాచీన సంపద అయిన యోగాను కూడా వారు అర్థం చేసుకోవట్లేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తిరస్కరిస్తున్నారు’ అని మోడీ మండిపడ్డారు. ‘ఎవరి హక్కులకూ భంగం కలగకుండా మేం ఈ మధ్య తీసుకొచ్చిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా.. ఒడిశాలో సామాజికంగా వెనుకబడిన వారికి చాలా ఉపయోగపడుతుంది. తూర్పు భారత్ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్డీఏ కృషి చేస్తోంది. రూ.1,550 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం.. అలాగే, కొన్ని పనులను ప్రారంభించాం. ఒడిశా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కెండ్రపర, పూరీ, జగత్సింగ్, బార్గఢ్, కంధామల్, బొలంగిర్ ప్రాంతాల్లో ఒకప్పుడు కొత్తగా పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పడ్డాయి’ అని మోడీ వివరించారు.
అదే విధంగా ‘ఈ నాలుగేళ్లలో దేశంలో మా ప్రభుత్వం పెద్ద మొత్తంలో అక్రమ రేషన్కార్డులు, గ్యాస్ కనెక్షన్లు, స్కాలర్షిప్లను రద్దు చేశాం. దీంతో కోట్లాది రూపాయలను పొదుపుచేశాం. అన్ని రేషన్కార్డులను డిజిటలైజ్ చేశాం. 80 శాతం రేషన్కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేశాం. ఒడిశాలో ఒక్క నెలలో రూ.20,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. ఒడిశా ఇప్పుడు గొప్ప పర్యాటక ప్రాంతంగా మారింది. ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.4,000ను ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించలేకపోయింది’ అని మోడీ వెల్లడించారు.