తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ విస్తరణకు రెడీ అవుతున్నారు. తొలుత ఎనిమిదిమందితో మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆ 8 మంది పేర్లతో జాబితాను కూడా సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. తొలి విస్తరణ తర్వాతా రెండో విస్తరణ లో మరో 8 మందిని కేబినెట్లోకి తీసుకోనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై కూడా రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 17వ తేదీన స్పీకర్ పదవికి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న కారణంగా ఒకరోజు ముందుగానే అభ్యర్థిని కేసీఆర్ ఎంపిక చేస్తారని తెలుస్తోంది. 2014లో స్పీకర్ ఎంపిక వెంటనే జరిగింది. అయితే ఈసారి మాత్రం కేసీఆర్ ఈ ప్రక్రియ చేపట్టలేదు. స్పీకర్ గా మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డిలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. వీరితో పాటు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రెడ్యా నాయక్ పేర్లు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం రేపు స్పీకర్ అభ్యర్థిని ప్రకటించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. దీని తర్వాత మరో సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేయనున్నారు. అలాగే కేసీఆర్ సిద్ధం చేసినట్టు చెబుతున్న మంత్రుల జాబితాలో కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లేదంటే పద్మాదేవేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లేదంటే ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్, వినయ్ భాస్కర్ లేదంటే జోగు రామన్న, జగదీశ్ రెడ్డి లేదంటే గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి లేదంటే పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి లేదంటే లక్ష్మారెడ్డి, రెడ్యానాయక్ లేదంటే రేఖానాయక్లకు మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది. స్పీకర్గా రెడ్డి సామాజిక వర్గం వారు ఎంపికైతే కనుక ఆ సామాజిక వర్గం నుంచి ఒక అభ్యర్థి తగ్గుతారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి స్పీకర్ ఎంపికైనా ప్రస్తుతం చెబుతున్నపేర్లలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. దీని పై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ రాలవాల్సి ఉంది.