వివాదాస్పద సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను రేపు (మార్చి 29న) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ హైకోర్టు సైతం క్లియరెన్స్ ఇచ్చేశాయి. ఇక సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు అనుకుంటోన్న తరుణంలో రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఏప్రిల్ 11న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సినిమా విడుదలను ఆపివేయాలని మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ ఆదేశాలు జారీ చేశారు.
ఏప్రిల్ 15 వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను థియేటర్లలో.. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రదర్శించకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇంజక్షన్ ఆర్డర్ను జారీ చేసింది. ఈ ఇంజక్షన్ ఆర్డర్ను దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజుతో పాటు నిర్మాత రాకేశ్ రెడ్డికి పంపింది. దీంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఆంధ్రప్రదేశ్లో బ్రేకులు పడినట్లయింది. అయితే అందుతున్న సమాచారం మేరకు 3/4/2019 కి లక్ష్మీస్ NTR మూవీ ని లాయర్ల సమక్షంలో చుసిన తరువాత, అప్పుడు ఎప్పుడు విడుదల చేస్తామో చెబుతారని పేర్కొన్నారు. ఈ సినిమాకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్ట్ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపధ్యంలో అక్కడ విడుదల చేయడానికి ఇబ్బంది లేదు కానీ వర్మ రేపు ఈ సినిమాను తెలంగాణలో విడుదల చేస్తారో లేదో చూడాలి. అయితే ఈ ఇంజక్షన్ ఆర్డర్పై రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టు ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. ఏమవనుందో వేచి చూడాలి మరి.