టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా బాగా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకుని కేటీఆర్ను సీఎంని చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ మధ్య కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు హల్చల్ చేచస్తున్నాయి... మరి గులాబీ బాస్ మదిలో ఏముందో తెలియదు కానీ.. సీనియర్ మంత్రులు సైతం.. కేటీఆర్కు జై కొడుతున్నారు. అయితే.. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇవాళ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్కు కంగ్రాట్స్ అంటూ పద్మారావు పేర్కొన్నారు. సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. అయితే.. కేటీఆర్ సమక్షంలో... బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్కు శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మరావు అన్నారు. దీంతో అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేశారు.