ప్రముఖ చిత్రకారుడు సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) ఇక లేరు. సుప్రసిద్ధ రచయత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడైన సుబ్బరాయశాస్త్రి చెన్నయ్ లో గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన తన కుమారునికి తన తండ్రి పేరు 'దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి' అని పెట్టుకున్నారు. కుమారుడు కూడా రచయిత. బుజ్జాయి కుమార్తె రేఖా సుప్రియ సీనియర్ సినీనటుడు నరేష్ మాజీ భార్య. ఆమె కుమారుడు తేజ. బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్ కూడా తెలుగు రచయిత్రి.సెప్టెంబరు 11, 1931లో జన్మించిన ఏ రోజునా పాఠశాలకు వెళ్లకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. 17 సంవత్సరాల వయసులో బుజ్జాయి పేరుతో 'బానిస పిల్ల' అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరు పొందారు. ఈ ఇంగ్లిష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. పలు భారతీయ భాషల్లో 42కు పైగా బొమ్మల కథలు వివిధ పత్రికలలో సంవత్సరాల పాటు సీరియల్ గా వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో 15 కార్టూన్ కథల పుస్తకాలను వెలువరించారు. శ్రీ బుజ్జాయి 2010లో 'నాన్న-నేను' అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని వ్రాసారు.