సికింద్రాబాద్లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని.. రాజకీయాలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ప్రధాని రాజకీయాలు చేయడం మంచిది కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్న మంత్రి తలసాని.. ప్రధాని తమతో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎందులో సహకరించలేదో ప్రధాని చెప్పాలన్నారు. హైదరాబాద్ వచ్చి మరీ తిట్టాలా.. దిల్లీలో కూర్చోని తిట్టొచ్చు కదా మంత్రి ఎద్దేవా చేశారు.
కేంద్రం ఏం అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నామో చెప్పాలని మంత్రి అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే అవార్డులు ఎందుకు ఇస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు కానీ నిధులు మాత్రం ఇవ్వట్లేదన్నారు. అదానీపై జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయట్లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. 24 గంటల కరెంట్పై ప్రధాని మోదీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బీజేపీలో కుటుంబ పాలన లేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. భారత్ బయోటెక్కు ప్రధాని వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ను ఎందుకు పిలవలేదని మంత్రి ప్రశ్నించారు. అక్కడి నుంచే కదా ప్రధాని-సీఎం మధ్య దూరం పెరిగిందంటూ మంత్రి తలసాని పేర్కొన్నారు. రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు ఇస్తే ఎవరైనా కాదన్నారా అని ఆయన ధ్వజమెత్తారు. దేశానికి ఎక్కువ శాతం పన్నులు కడుతున్నది తెలంగాణ అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు.
తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత కక్ష అంటూ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా మంత్రి ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చేది గోరంత.. చెప్పుకునేది కొండంత అని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే ఇప్పుడూ రాజకీయాల్లో ఉన్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అవార్డులు ఎందుకు రావట్లేదని శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి కూడా రైళ్లు వెళ్లాలి కాబట్టే.. వందేభారత్ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా లేదని.. అప్పర్భద్రకు ఎందుకు ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. రైతుల వద్ద పంట కొంటారా.. లేదా అనేది మోదీ మాట్లాడలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది వలస వచ్చిన వారు ఉంటారన్న ఆయన.. రేషన్ పెంచమని అడిగితే పెంచలేదన్నారు. కేంద్రం 10 ఏళ్లలో ఒక్క రేషన్కార్డు కూడా పెంచలేదని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రేషన్కార్డులు పెంచుతూ.. 97 లక్షల మందికి రేషన్కార్డు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి గంగుల స్పష్టం చేశారు.