తిరుపతిలోని శిల్పారామం వేదికగా చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఉండాల్సి రావడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ప్రకటించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 2024 ఎమ్మెల్యే అభ్యర్థిగా జనం ముదుకు వచ్చే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు చెవిరెడ్డి. కేరింతలు పెడుతూ కరతాళ ధ్వనులతో మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ తమ మద్దతు తెలియపరచారు పార్టీ నేతలు, కార్యకర్తలు.
ఆత్మీయ సమ్మేళనంలో చెవిరెడ్డి మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు జన్మనిస్తే.. చంద్రగిరి ప్రజలు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. నన్ను నమ్మి నాతో పాటు ప్రయాణించి ఈ స్థాయికి చేర్చిన పార్టీ నేతలు, కార్యకర్తలకు రుణపడి ఉన్నాను. చంద్రగిరి నుంచి రాష్ట్ర స్థాయి నాయకునిగా నాకు గుర్తింపు వచ్చిందంటే అదంతా మీరు పెట్టిన భిక్ష. నా కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించే చంద్రగిరి ప్రజలకు కొంత దూరంగా ముఖ్యమంత్రి జగనన్నకు దగ్గరగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.ముఖ్యమంత్రి జగనన్న సూచన మేరకు మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. మీ అందరి కళ్ల ముందు పెరిగిన నా బిడ్డ మోహిత్ ను మీ బిడ్డగా దగ్గరకు తీసుకుని ఆదరించండి.ఇప్పటికే గడపగడపలో మోహిత్ ను ప్రజలకు పరిచయం చేసినా ఇకపై మరింతగా జనం మధ్యకు తీసుకుని వెళ్లాలి.చిన్నతనం వల్ల తెలిసో తెలియక ఎవ్వరిమనస్సు అయినా నొప్పించి ఉంటే మోహిత్ ను పెద్ద మనస్సుతో క్షమించండి అన్నారు.