రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గతంలో ఒక ముసలాయన సీఎంగా ఉన్నపుడు ఈ పథకాలు ఉన్నాయా.. చంద్రబాబు పాలనలో ఉన్నదేంటి.. దోచుకో, తినుకో, పంచుకో అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. ‘ప్రతీ లబ్ధిదారుడికి పారదర్శకంగా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు.. ఆ ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లోకి వేశారా.. గతంలో జరగనివి.. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆలోచన చేయాలి.. ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో ఎవరు దోచుకున్నారు.. ఎవరు పంచుకున్నారు.. ఎవరు తిన్నారు.. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ముసలాయాన మాట్లాడడు.. సెల్ఫీ అంటాడు.. నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు.. ఫేక్ ఫోటోలతో సేల్ఫీ ఛాలెంజ్ అంటాడు.. ఛాలెంజ్ అంటే అవికాదు.. ప్రతీ పేదవాడి ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా వల్ల జరిగిన లబ్ది అని చెప్పగలగడం ఛాలెంజ్.. నువ్వు బాగా చేశావయ్యా అని పేదలు అనగలిగితే దాన్ని అంటారు సెల్ఫీ అని.. పేద వాడికి చేసిన మంచి ఎంత చెప్పే సత్తా ఉందా చంద్రబాబు.. నిజాలు దాచి నిందలు, అబద్ధాలు దాచి ప్రచారాలు చేస్తారు.. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజాలు అని చెప్పే ప్రయత్నం.. గత పాలనలో వారేం చేశారో చెప్పాలి.. సెల్ఫీ దిగే నైతికత, పాలన గురించి ఇంటికి స్టిక్కర్ వేసే దైర్యం ఉందా.. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను రోడ్లమీద నిలబెట్టారు.. ఈ మోసాల బాబును గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలి’ అని ఆయన అన్నారు.
ప్రతీ పేదవాడికి మంచి చేస్తున్న జగన్ ను కాదని నీతో సెల్ఫీలు దిగాలా అని ప్రశ్నించాలన్నారు. గతానికి, ఇప్పటికీ తేడా గురించి అడగాలని, చంద్రబాబు ముష్టి వేసినట్లు వెయ్యి పెన్షన్ ఇచ్చారన్నారు. చంద్రబాబుకు సీఎం పదవి అంటే దోచుకోవడం, తినుకోవటం అని ఆయన ధ్వజమెత్తారు. జగన్ కు సీఎం పదవి ఇవ్వటం అంటే ప్రతీ పేదవాడికి మంచి చేయడమేనని, ఎన్నికలయ్యాక మానిఫెస్టో వెబ్ సైట్లలో వెతికినా కనిపించవన్నారు. రాబోయే ఇంకా చాలా డ్రామాలు చూస్తామని, వాళ్లకు తోడుగా వాళ్ల దత్త పుత్రుడు ఉన్నాడని, నేను ప్రజలనే నమ్మి ముందుకు వెళ్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు. నాకు ప్రజలే సైనికులని, ప్రజలు మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలన్నారు. ‘వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తయింది.. సెప్టెంబర్, అక్టోబర్ లో పూర్తి చేస్తాం.. అక్టోబర్ లో వచ్చి ప్రాజెక్ట్ ప్రారంభిస్తా.. వైఎస్ఆర్ హయాంలో 20 కిలోమీటర్ల మేర సొరంగాలు పూర్తి చేశారు.. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే తీశారు.. ఎన్నెస్పీ కెనాల్ నుంచి పొదిలి చెరువుకు మంచి నీటి కోసం పైప్ లైన్ పనులు.. మార్కాపురం మెడికల్ కళాశాలకు భూములు ఇచ్చిన పేదలకు అదనంగా మరో మూడు లక్షలు ఇస్తాం’ అని ఆయన వెల్లడించారు.