ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరనుంది. రేపటి నుండి బడి పిల్లలకు ఉదయం పూట రాగి జావ అందించనున్నారు. జగనన్న గోరుముద్దలో భాగంగా రేపటి నుండి వారానికి 3 రోజుల పాటు రాగి జావ అందించే కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ఏటా రూ. 86 కోట్ల వ్యయం అవుతుందని భావిస్తున్నారు. ఆర్థికఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోలని విద్యార్థినీ, విద్యార్ధులకు ఈ పథకం ద్వారా పోషకాహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
రేపు క్యాంప్ కార్యాలయం నుండి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 44392 పాఠశాలల్లోని 37.63లక్షల మంది పిల్లలకు వారంలో మూడు రోజుల పాటు రాగి జావ పంపిణీ చేస్తారు. రాగి జావ ద్వారా రక్తహీనత, పోషకాల లోపాలను నివారించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
రాగిజావతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?
రాగి జావలో క్యాల్షియం (Calcium), పీచుపదార్థం (Fiber), మాంసకృత్తులు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక రాగి జావను తాగితే కడుపు నిండిన అనుభూతి కలిగి తొందరగా ఆకలి అవ్వదు. ఇది జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించి నిదానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే తీసుకునే ఆహారంపై కూడా దీని ప్రభావం పడి, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకునేలా చేస్తుంది.
* రాగి జావ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక కొవ్వు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. రాగులలో అమైనో ఆమ్లాలు (Amino acids) అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడ్డ చెడు కొవ్వులను కరిగించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఈ హార్మోన్లు (Hormones) శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, అధిక బరువును సులభంగా తగ్గిస్తాయని రుజువయింది.
*రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు బీ విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. రాగులు చాలా మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
* రాగులను కొందరు దోశలా వేసుకుని తింటారు. అలా తిన్నా మంచిదే. అలాగే, ఉప్మాలా చేసుకోని తిన్నా.. శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా మేలే. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి.
*రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రాగులను ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించడం ఆరోగ్యానికి శుభదాయకం.