సోషల్‌ మీడియా వేధింపుల ఆటకట్టు..!

0
83

హోంశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. సోషల్‌ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్న ఆయన.. దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.. ఇక, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్‌ ఉండాలని స్పష్టం చేశారు.. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలన్న ఆయన.. దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు..

మరోవైపు.. దిశ యాప్‌ మీద మరోసారి డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు సీఎం జగన్‌.. ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై మరోసారి పరిశీలన చేయాలన్నారు.. ఇక, దిశ యాప్‌ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలని వెల్లడించారు. మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించాలని ఆదేశించారు.. మాదకద్రవ్యాల రవాణా, పంపిణీ, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని పేర్కొన్న ఆయన.. డ్రగ్‌ పెడలర్స్‌ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.. వీరికి శిక్షలు పెంచేలా ఆలోచన చేయాలన్నారు.. ఇక, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్‌స్టేషన్‌ ఉండాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హోం శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here