రోజు రోజుకు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. పార్టీలో అంతర్గత అంశాలపై అధిష్టానం పిలిచి మాట్లాడాలన్నారు. అందరికీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఉందని, మర్రి శశిధర్ రెడ్డి ఆవేదన చెప్పాడని, దాన్ని అధిష్టానం సరిదిద్దాలని సూచించారు. అయితే.. నన్ను కూడా గతంలో తిట్టారు.. అవమాన పరిచారన్న హనుమంతరావు.. హైకమాండ్ ఆలోచనా చేయాలన్నారు. సమావేశాలు పెట్టి మాట్లాడే అవకాశం ఇస్తే… అక్కడ మాట్లాడ వచ్చని, మీటింగులు పెట్టకపోతే బయట మాట్లాడతారన్నారు. మునుగోడు లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన అభ్యర్ధిని పెడితే మంచిదని హనుమంతరావు హితవు పలికారు. మునుగోడు ఎన్నికల తర్వాత మాట్లాడతానని, ఇంఛార్జి కూర్చోపెట్టి మాట్లాడాలన్నారు.
ఇప్పుడు అది లేదని, కేసీ వేణుగోపాల్ టైం ఇవ్వడని, హైకమాండ్ పిలిచి మాట్లాడాలన్నారు. గుజరాత్ లో హత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తుల్ని వదిలేశారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇదేం పద్దతని, వైకుంఠ రథం పై భగవద్గీత పెట్టొద్దు అంటాడు బండి సంజయ్.. ఏం మాట్లాడతారు సంజయ్.. ఇదేం పద్దతి.. నరేంద్ర మోడీ… ఇలాంటి ప్రెసిడెంట్ నీ ఎట్లా పెట్టావు రా బాబు.. ఇలాంటి మాటలు చూస్తే… భవిష్యత్తు తరాలు.. రాజకీయ నాయకులను అసహ్యానిచుకునే పరిస్థితి.. ఏం ఘనకార్యం చేశాడు అని పాదయాత్ర చేస్తున్నాడంటూ’ అని హనుమంతరావు మండిపడ్డారు.