తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా.. నిన్న దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్న ప్రకటించి.. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ పంపారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ నుంచి వెళుతూ.. వెళుతూ.. ఇన్ని రోజులు ఉన్న పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఇరవర్తి అనిల్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్ రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలు ఖండిస్తున్నామన్నారు. నాతో పాటు ప్రజారాజ్యంలో పని చేశాడని, చిరంజీవి మంచి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చిరంజీవి ఎంతో ప్రాధాన్యత ఇస్తే… పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయాడని, చిరంజీవి అన్నయ్య అంటావు.. ఆరోజు పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేయించావు అంటూ దాసోజుపై మండిపడ్డారు.
కేసీఆర్ దగ్గరికితీసి గౌరవిస్తే.. భువనగిరి టికెట్ ఇవ్వలేదని బయటకు వచ్చావని, కాంగ్రెస్ లో నీకు ఏం తక్కువ అయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదని, జైపాల్ రెడ్డి లాంటి వ్యక్తి చేసిన పదవి ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన గుర్తు చేశారు. 2018లో కాంగ్రెస్ బీ ఫామ్ ఇచ్చిందని, నిన్ను పార్టీ ఎక్కడ.. ఎప్పుడు అవమానించిందని ఆయన అన్నారు. 2007 నుండి ఖైరతాబాద్ లో పని చేసిన రోహిన్ రెడ్డిని కాదని నీకు టికెట్ ఇచ్చింది పార్టీ అని.. అప్పుడు రోహిన్ రెడ్డికి అన్యాయం జరగలేదా..? అని ఆయన దుయ్యబట్టారు. పార్టీ బలోపేతం కోసం కొందరు నాయకులు వస్తే తీసుకుంటారు…తప్పేంటని అనిల్ వ్యాఖ్యానించారు.