ఈఏడాది ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో మామూలుగానే మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఎండ ఎక్కువగా వున్నా సరే మందుబాబులో ఫేవరెట్ బీర్లు. ఎండాకాలం వచ్చిందంటే ఇక బీర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది కూడా అలాగే ఉంది. గతంలో కంటే ఈసారి ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మద్యం ప్రియులు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు బీరు ను తాగేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత పదిరోజుల్లో బీర్ల అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ 1 నుంచి 10 వరకు బీర్ల అమ్మకాల్లో పెరుగుదల గణనీయంగా నమోదవుతున్నది. గత ఏడాది తో పోలిస్తే ఏప్రిల్ ఒకటి నుంచి పది వరకు బీర్ల అమ్మకాలు 20% పెరిగినట్లు తెలుస్తుంది.
కేవలం పది రోజుల్లోనే పది లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఇదే సమయంలో ఈ లెక్క 8.3 లక్షల కేసుల బీర్లుగా ఉన్నది. ఇతర రకాల మద్యం అమ్మకాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. 2021 ఏప్రిల్ మొదటి పదిరోజుల్లో 6 లక్షల కేసులుగా ఉన్న మద్యం అమ్మకాలు ఈ ఏడాది 13% తగ్గి 5.14 లక్షల కేసులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక ఇప్పుడే ఈ రేంజ్ లో డిమాండ్ ఉంటె వచ్చే నెలలో బీర్ల డిమాండ్ మరింత అధికం కావడం ఖాయం అంటున్నారు అధికారులు. ఈ ఏడాది బీర్లు, ఇతర మద్యం అమ్మకాలు కొత్త రికార్డుల కిక్ తేవడం ఖాయంగా కనిపిస్తోంది.