జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పార్టీ కొన్ని కార్యక్రమాలను స్థూలంగా రూపొందించింది. ప్రజాప్రతినిధులు వీలయినంత వరకు ప్రజల్లోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించామన్నారు కేటీఆర్. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని, పార్టీలో పనిచేసే కిందిస్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచన. ప్రతీ పది గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మెల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలి. పట్టణాల్లో ఒక్కో పట్టణానికి, లేదా పట్టణాల్లోని డివిజన్లను కలుపుకుని ఈ సమ్మేళనాలు నిర్వహించాలి. ఈ సమ్మేళనాల్లో స్థానిక ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేషన్ ఛైర్మన్ లను డిసిసిబి, డిసిఎంఎస్ తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని పోవాలి. ఈ ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలి. ఏప్రిల్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఈ ఆత్మీయ సమ్మేళన నిర్వహణ పూర్తి కావాలి. ఈ దిశగా జిల్లా అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను కవర్ చేసేలా, 10 గ్రామాలకు ఒక యూనిట్లుగా విభజించి… ఆయా యూనిట్లలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన సంపూర్ణమైన షెడ్యూల్ (క్యాలండర్) పార్టీకి వెంటనే అందించాలి. ఏరోజు ఏఏ యూనిట్ లో, ఎక్కడ అత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారో తేదీలతో సహా పార్టీ వివరాలు అందించాలి.
దీంతోపాటు జిల్లా పార్టీ కార్యాలయాలు అన్నింటిని ప్రారంభించుకోవాలి. ఈ కార్యక్రమం కూడా ఏప్రిల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి కావాలి. దీనికి సంబంధించిన షెడ్యూల్ వెంటనే సిద్ధం చేయాలి. ఈ విషయంలో పార్టీతో సమన్వయం చేసుకొని, కార్యాలయాల ప్రారంభోత్సవ తేదీలను నిర్ణయించాలి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మన ప్రభుత్వం, మన పార్టీ నిర్ణయించింది. ఈ దిశగా జయంతి ఉత్సవాల కార్యక్రమాలను రూపొందించుకోవాలి. ఒకవైపు దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరోవైపు పరిపాలన ఆత్మగౌరవ చిహ్నం అయిన నూతన సచివాలయనికి సైతం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినాము. దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ విధంగా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని స్ఫూర్తిని ఇంత గొప్పగా గౌరవించుకోలేదు. మన ప్రభుత్వం మన పార్టీ చేపట్టిన ఈ అద్భుతమైన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆయన జయంతి ఉత్సవాలనురాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలి.
జూన్ 1 న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ నేపథ్యంలో విస్తృతంగా పలు కార్యక్రమాలను చేపట్టాలి. దీంతోపాటు 2023-24 విద్య సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టాలి. పార్టీ విద్యార్థి విభాగ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుంది. పార్టీ విద్యార్థి విభాగం నూతన కమిటీలను వేసుకోవడం. ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్య కళాశాలలలో నూతన విద్యార్థులకు స్వాగత సభల పేరుతో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 25 నాడు నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రతినిధుల సమావేశాలను నిర్వహించుకోవాలి. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఏప్రిల్ 25న పార్టీ జెండాల ఆవిష్కరణ అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు టెలికాన్ఫరెన్స్లో పేర్కొన్న అంశాలను పార్టీ ఇచ్చిన కార్యాచరణపైన ఈ వారంలోనే నేరుగా పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుంది. ఈ సమావేశం నాటికి ఈరోజు చర్చించిన కార్యక్రమాల పైన ఒక స్థూలమైన ప్రణాళికను సిద్ధం చేసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.