తిరుపతిలో ఎలక్ట్రికల్ సేఫ్టీ వర్క్ షాప్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఆర్ధిక అభివృద్ధికి విద్యుత్ శాఖ చాలా ముఖ్యం అని ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మరో సారి రుజువైందన్నారు. అనేక రకాల సమస్యలను అధిగమించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ముఖ్యమని, చిన్న అలసత్వం కూడా అత్యంత ప్రమాదకరమన్నారు. అటవీ జంతువులు కట్టడికి కూడా విద్యుత్ వైర్లు లాగుతున్న పరిస్థితి ఉందని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తె అందులో 9 లక్షల కోట్లు విద్యుత్ శాఖకు వచ్చాయన్నారు.
చంద్రబాబు నాయుడు భారీగా ప్రచారం చేసుకున్నా కూడా అయన పెట్టిన సమ్మిట్ కు సంబందించి ఎక్కడా ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని ఆయన వెల్లడించారు. ఈరోజు సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమ్మిట్ కు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. ‘ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. సబ్ స్టేషన్ లెవల్ లో కూడా కమిటీ వేస్తే, వారి సమన్వయంతో మరింత ముందుకు సాగుదాం. అనంతపురం లో వరుసగా విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి చర్యలు చేపట్టాం. ఒకేసారి 15 వేల మంది ఎనర్జీ అసిస్టెంట్స్ ను ఇప్పటికే నియమించాం. వారి సేవలు కూడా ఉపయోగించుకోవాలి, ఒక పటిష్టమైన కమ్యునికేషన్ వ్యవస్థ సిద్దం చేయాలి. ముందుకు వచ్చిన పెట్టుబడిదారులకు సహకరించి వారికి ప్రక్రియ సులభంగా మారేందుకు చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజిపడటానికి వీల్లేదు. ఈ వర్స్ షాప్ ద్వారా అందరికీ పూర్తి స్థాయి అవగాహన వస్తుందని ఆశిస్తున్నా.’ అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.