సచివాలయంలోకి అడుగు పెట్టాలంటే అంత ఈజీ కాదు.. ఇంత కథ ఉందా..?

0
46

సచివాలయంలోకి వెళ్ళే వారికి ఇకపై డిజిటల్‌ పాస్‌లను ఇవ్వాలని సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు. డిజిటల్‌ పాసులతో సచివాలయంలోకి అడుగు పెట్టిన వారు.. ఒక శాఖకు చెందిన అధికారులను మాత్రమే కలవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ పాస్‌ తీసుకొని సచివాలయంలోకి వెళ్ళిన తరువాత గతంలో మాదిరిగా తనకు అవసరం ఉన్న ఇతర శాఖల అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అనుకుంటే.. ఇకపై కుదరదు. సచివాలయంలోకి వెళ్ళాలి అనుకుంటే ఏ శాఖ అధికారులను కలవాలో ముందుగా ఎంట్రెన్స్‌ దగ్గర చెబితే.. ఆ శాఖ అధికారులను కలవడానికి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పాస్‌ను జారీ చేస్తారు. ఆ పాస్‌ ద్వారా సంబంధిత శాఖ అధికారిని కలిసిన తరువాత తిరిగి రావాల్సి ఉంటుంది. మరో శాఖ అధికారిని కానీ లేదా తనకు తెలిసిన వారిని కలవడానికి గానీ అవకాశం లేకుండా కొత్తగా రూపొందించే డిజిటల్‌ పాసులను జారీ చేయాలని సచివాలయం భద్రత అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి టెక్నాలజీ రూపకల్పన పనిలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ అధికారులతోపాటు.. ఎలక్ర్టానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్‌ శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా పనిచేస్తున్నారు.

గతంలో తెలంగాణ సచివాలయంలోకి వెళ్లాలి అనుకుంటే మధ్యాహ్నం 3 గంటలకు వస్తే పాస్‌లను జారీ చేసేవారు. వాటిని తీసుకొని వెళ్లి తాము కలవాల్సిన అధికారులను కలిసి పనులను చేయించుకునే వారు. ఇప్పుడు కూడా పాస్‌లను జారీ చేస్తారు.. కానీ, ఇకపై జారీ చేసే పాసులు డిజిటలైజేషన్‌లో ఉండనున్నాయి. ఈ డిజిటల్‌ పాసును తీసుకున్న వారు గతంలో మాదిరిగా రెండు, మూడు శాఖల అధికారులను కలవడానికి వీలు ఉండదు. ప్రత్యేకంగా డిజిటల్ పాస్‌లను రూపొందిస్తున్నారు. ఈ డిజిటల్‌ పాసుల ద్వారా వారు ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు.. ఆ శాఖకు సంబంధించిన ద్వారాలు మాత్రమే తెరచుకుంటాయి. ఆ శాఖ దగ్గర తమ పని ముగిసిన తరువాత ఇతర శాఖ అధికారులను కలవడానికి వెళ్ళాలి అనుకుంటే ఆ శాఖలకు సంబంధించిన ద్వారాలు తెరచుకోకుండా క్యూఆర్‌ కోడ్‌ను రూపొందించారు. వారు మరో శాఖ అధికారిని కలవాలి అనుకుంటే ఆ శాఖకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ ఉన్న పాస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే విద్యా శాఖ అధికారులతో పని ఉన్న వారు ఆ శాఖ జారీ చేసిన పాస్‌తో లోనికి వెళ్లిన తరువాత పని ముగియగానే.. సంక్షేమ శాఖ అధికారులను కలవాలనుకుంటే ఆ శాఖ ద్వారాలు తెరచుకోవు. వారు విద్య శాఖకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ ఉన్న డిజిటల్‌ పాస్‌ను తీసుకోవాలి.

క్యూఆర్‌ కోడ్‌ ఉన్న పాసులను జారీ చేయడం తెలంగాణలో ప్రారంభించేకంటే ముందుగా ఇతర రాష్ర్టాల్లో ఎక్కడ ఎలా అమలులో ఉన్నదో కూడా అధికారులు పరిశీలన చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ముంబయిలో ఇటువంటి విధానం అమలులో ఉంది. అయితే అక్కడ ఫోటోతో కూడిన ఐడీ కార్డును జారీ చేస్తారు. అలా జారీ చేసిన ఫోటో ఐడీ కార్డుతో సదరు వ్యక్తి సంబంధిత శాఖ అధికారిని మాత్రమే కలసి రావడానికి అవకాశం ఉంది. 2019లో తమిళనాడులో యాప్‌ బేస్డ్‌ ఫోటో ఐడీ సెక్యూరిటీ సిస్టంను పైలట్ విధానంలో ప్రారంభించింది. ఇందులో సచివాలయంలోనికి వెళ్లాలి అనుకునే వ్యక్తి తన వివరాలను యాప్‌లో భర్తీ చేయాల్సి ఉంటుంది. తరువాత ఏ శాఖ అధికారిని కలవాలి.. ఎందుకోసం కలవాలో చెబితే సదరు వ్యక్తికి యాప్‌ బేస్డ్ ఫోటో ఐడీని జారీ చేస్తారు. అలా జారీ చేసిన ఫోటో ఐడీ ఎంత మంది అధికారులను అయినా కలవడానికి అవకాశం ఇస్తున్నారు. సదరు వ్యక్తి సచివాలయంలో పని ముగించుకొని తిరిగి వేళ్ళే సమయంలో సెక్యూరిటీ అధికారులు జారీ చేసిన యాప్‌ బేస్డ్‌ ఫోటో ఐడీని సెక్యూరిటీ అధికారులకు ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here