కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రేపు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా ఒక మంత్రిగా నిజమాబాద్లో పర్యటించి అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్ లను మరియు నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగిందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రెండు రోజుల ముందుగానే అరెస్టు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు పొన్నం ప్రభాకర్. మీరు నిజంగా ఇటువంటి నిరసనలు ఎదుర్కోవద్దు అనుకుంటే హుజరాబాద్ ఉప ఎన్నికల్లో వేలకోట్ల హామీలను అమలు చేయండని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. కుల సంఘాలకు, గ్రామాలకు, రోడ్లు ఇతర ప్రజా సమస్యలు కావచ్చు అమలు చేయండని ఆయన అన్నారు. మీరు రాజకీయ పర్యటనలు చేపట్టి నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టి మీరు పర్యటనను విజయవంతంగా చేసుకుందామనుకుంటే పొరపాటే అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు పొన్నం ప్రభాకర్. ఇదిలా ఉంటే.. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి చేశారు. అగ్రనేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.