తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, ఏపీలో మొత్తంగా 25 మండలాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. అసెంబ్లీ మీడియాలో పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలపై సీఎం వైఎస్ జ గన్ సమీక్షించారని తెలిపారు.. వారం రోజులపై పంట నష్టపరిహారంపై ప్రాథమిక అంచనా ఇవ్వాలని కలెక్టర్లని సీఎం ఆదేశించారని తెలిపిన ఆయన.. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో అకాల వర్షాలు రావడం దురదృష్టకరం అన్నారు.
ఎన్టీఆర్, కర్నూలు, పార్వతీపురం, ప్రకాశం, మన్యం తదితర జిల్లాలలో వరి, మొక్కజొన్న, అరటి, మినుము, పత్తి పంటలు నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు మంత్రి వేణు గోపాల కృష్ణ. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.. నంద్యాల జిల్లాలో 15, ఎన్టీఆర్ జిల్లాలో ఐదు, కర్నూలులో ఒకటి, మన్యం జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో ఒకటి ఇలా మొత్తంగా 25 మండలాల్లో పంట నష్డం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్టు వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ. కాగా, రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.. సీఎంవో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్కు అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్యుమరేషన్ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.