సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు వారి ఉచ్చుకు చిక్కుకుని విలవిలలాడుతున్నారు. రోజుకో టెక్నిక్ ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా వారి బాధితులు కావడం గమనార్హం. తాజాగా ఆ జాబితాలో జీవిత రాజశేఖర్ చేరారు. జీవిత రాజశేఖర్ ఓ సైబర్ నేరగాడు చేతిలో మోసపోయారు. అతడు మాటలను నమ్మి లక్షన్నరకు పైగా నగదును జీవితా మేనేజర్ ట్రాన్స్ ఫర్ చేశారు. అసలు విషయానికి వస్తే.. జీవిత ఇటీవల ఇంట్లో జియో వైఫై కనెక్షన్ తీసుకున్నారు. అయితే కనెక్షన్ తీసుకున్న కొద్దిరోజులకు జీవితకు ఒక కాల్ వచ్చింది. మీ ఇంట్లో వైఫై ఇన్స్టాల్ చేసింది తానే అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చి.. జియో వస్తువులను కూడా అమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు. అవి అమ్మితే తనకు మరో ప్రమోషన్ వస్తుందని చెప్పాడు. సగం ధరకే జియో బహుమతులు అందజేస్తానని.. తన ప్రమోషన్ కోసం సహకరించాలని జీవితను నమ్మించాడు. అందులోనూ పలువురు తెలిసిన వాళ్ల పేర్లు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. అతడు అంతలా రిక్వెస్ట్ చేయడంతో… సరేనంటూ… ఆ వ్యవహారమేంటో చూసుకోవాలని తన మేనేజర్లకు చెప్పారు.
దీంతో జీవిత మేనేజర్ ఆ సైబర్ నేరగాడికి కాల్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు ఇచ్చిన జాబితాలో నుంచి పలు వస్తువులను ఎంచుకున్నాడు. అయితే వీటికి సంబంధించిన టోకెన్ అమౌంట్ పంపించాలని మేనేజర్ని అడిగాడు. దీంతో మేనేజర్ వెంటనే లక్షన్నర రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ కాగానే.. ఆ సైబర్ నేరగాడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మేనేజర్.. జీవితకు అసలు విషయం చెప్పాడు. ఇక చేసేది ఏం లేక… జీవితా రాజశేఖర్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాడి సెల్ఫోన్ డేటా ఆధారంగా నిందితుడు చెన్నైకి చెందిన నరేశ్గా గుర్తించారు. వెంటనే అతడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా నరేష్ ఈ విధంగా పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు.